
- ఫిట్నెస్ సాధించిన సంజూ శాంసన్
న్యూఢిల్లీ: కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గతేడాది చివరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 18వ సీజన్లో మెరుగైన ఆట చూపెట్టాలని ఆశిస్తోంది. కానీ, కొత్త సీజన్ ఆరంభానికి ముందే ఆ టీమ్కు షాక్ తగలనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఆడే ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. జనవరిలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో వెన్ను గాయంతో ఆటకు దూరమైన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఈ కారణంగానే చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్ పేసర్ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ ఫిజియోలు చెబుతున్నారు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నెట్ ప్రాక్టీస్, మ్యాచ్ సిమ్యులేషన్ ద్వారా బుమ్రా బౌలింగ్ వర్క్లోడ్ను పెంచుతునప్పటికీ అతను రీఎంట్రీ ఇచ్చేందుకు ఫిజియోలు ఎలాంటి డెడ్లైన్ పెట్టుకోలేదని తెలుస్తోంది. జూన్లో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా పూర్తి ఫిట్నెస్తో రీఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
బుమ్రా లేకుంటే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు భారీ దెబ్బ తగలనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ప్రీత్ ముంబై ఆడే తొలి ఐదు మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం ఉంది. తను ఏప్రిల్ తొలి వారం జట్టుతో చేరే అవకాశం ఉంది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల కుడి చేతి వేలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంజూత బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేవని బీసీసీఐ ఫిజియోలు నిర్ధారించారు. అయితే వికెట్ కీపింగ్ చేయడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక, గాయాల నుంచి కోలుకుంటున్న పేసర్లు మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్ ఐపీఎల్కు అందుబాటులో ఉంటారా
అనేది చూడాలి.